top of page

చిరునవ్వుల దీవెన

#ChirunavvulaDeevena, #చిరునవ్వులదీవెన, #GorrepatiSreenu, #గొర్రెపాటిశ్రీను, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు


Chirunavvula Deevena - New Telugu Story Written By - Gorrepati Sreenu

Published In manatelugukathalu.com On 28/07/2025

చిరునవ్వుల దీవెనతెలుగు కథ

రచన: గొర్రెపాటి శ్రీను


విశ్వవిద్యాలయ కళావేదిక అందంగా అలంకరించి ఉంది. 

రాష్ట్ర గవర్నర్ గారి తో పాటు ఎంతో మంది ప్రముఖులు వేదికపై ఆశీనులై ఉన్నారు. యూనివర్సిటీ స్నాతకోత్సవ వేళ.. ఒక ఉద్యేగమైన వాతావరణం నిండి ఉందక్కడ. 

వేదిక ముందు కూర్చున్న స్కాలర్స్ అందరూ ఉత్సాహంగా కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు. 

*

సహస్ర బస్ స్టాప్ లో నిలబడింది. 

"అమ్మ! ఈరోజు నేను స్కూల్ కి వెళ్ళనే.."

గారాలు పోతూ అడుగుతుంది సహస్ర అమ్మని. 


"ఎందుకమ్మ.."


"ఒంట్లో బాగోలేదే.. !"


"నాకు తెలుసమ్మా నీ ప్రాబ్లం. వెళ్ళాల్సిందే! టీచర్ ఏమనరు లే"


"అది కాదమ్మా.. నన్ను అర్థం చేసుకో. వెళ్ళలేనే !"


అమ్మ ప్రేమగా సహస్ర నుదుటిపై ముద్దు పెడుతుంటే.. 

స్కూల్ బస్ వచ్చింది. 


మెల్లగా బస్ ఎక్కి.. తల్లికి వీడ్కోలు చెప్పింది. 

అప్పటి వరకు ప్రైమరీ స్కూల్ లో చదువుకున్న సహస్ర.. ఇప్పుడు హై స్కూల్ లో చేరింది. 


స్కూల్ దూరంగా ఉండడం.. పల్లెటూరు నుండి పట్టణ స్కూల్ చెరడం.. రోజు తాము ఉంటున్న పల్లెటూరు నుంచి సిటీ కి వెళుతుంది. 


సిక్స్త్ క్లాస్ లో అన్ని సబ్జక్ట్స్ అర్థమవుతున్నా మ్యాథ్స్ మాత్రం కష్టంగా ఉన్నాయి. 

క్లాస్ అంతా నిశ్శబ్దంగా ఉంది. 

మెర్సీ టీచర్ వస్తున్నారని తన మేని పరిమళం పరిచయం అవుతుంది. 


పిల్లలందరు లేచి.. "గుడ్మార్నింగ్ మేడం"అంటూ వినయంగా నమస్కరించారు. 


అందరూ ఒక్కొక్కరిగా లేచి తాము చేసిన మ్యాథ్స్ నోట్స్ టేబుల్ పై పెడుతున్నారు. 

సహస్ర మౌనంగా కూర్చుంది. 

"స్టాండ్ అప్ సహస్ర "


టీచర్ తన నే పిలుస్తుంటే లేచి నుంచుంది. 


తన నయనాల నిండా కన్నీళ్ళు నిలిచాయి. 

తాను ఈ క్లాస్ లో చేరి నెల రోజులు మాత్రమే అవుతుంది. 

అప్పటి వరకూ పల్లెటూరి లో చదువుకున్న తను.. నేడు సిటీ లోని హైస్కూల్ లో విద్యార్థి గా.. సమస్య ఏంటంటే మ్యాథ్స్ అర్థం కావడం లేదు. 


క్లాస్ లో అర్థం కావడం లేదు.. ఇంక హోం వర్క్ అంటే తన వల్ల కావడం లేదు. 

మెర్సీ టీచర్ కోపంగా తన దగ్గరకు రావడం.. సహస్ర గట్టిగా ఏడ్చినంత పని చేసింది. 


కొడుతుందేమో అనుకున్న తను.. కొట్టలేదు సరి కదా.. 

తనని దగ్గరకు తీసుకుని మెల్లగా హత్తుకుంది. 

కన్నీళ్లు కాస్త ఆనందభాష్పాలు గా మారాయి. 


బోర్డ్ దగ్గర కి తన ని తీసుకువెళ్లి హోంవర్క్ బోర్డు పై రాసి సహస్ర కి అర్థమయ్యేలా చెబుతూ.. సహస్ర చేత ఆ లెక్కలు చేపించి.. 

అందరి ముందు తన ని చిరునవ్వుల దీవెనలతో అభినందించింది. 


ప్రతి విద్యార్థికీ అర్థమయ్యేలా ఒకటికి రెండు సార్లు చెబుతూ అందరికీ లెక్కల పట్ల ప్రేమను పెంచింది మెర్సీ టీచర్. 

పదోతరగతి పాసయ్యే వరకూ తన స్టూడెంట్స్ అందరినీ తన బిడ్డల్లా ఆదరించి.. అందరూ తన సబ్జెక్ట్ లో డిస్టింక్షన్ లో పాస్ అవడానికి కారణమయింది. 


కాలేజీలో చేరిన తన స్టూడెంట్స్ కి సైతం అప్పుడప్పుడు కాల్ చేస్తూ బాగా చదువుకోమని ప్రోత్సహించే మంచి మనిషి.. మానవత్వానికి,స్ఫూర్తి కి నిలువెత్తు నిదర్శనం మెర్సీ టీచర్. 

తన మేడం గుర్తుకు రావడంతో సహస్ర పెదవులపై చిరునవ్వుల రాగాలు చిగురించాయి. 

*

"సహస్ర"


తన పేరు స్టేజ్ పై నుండి పిలుస్తుంటే.. ఉల్లాసంగా లేచింది సహస్ర. 


"ఈ విద్యాసంవత్సరం మ్యాథ్స్ లో అత్యద్భుత ప్రతిభ కనబరిచి.. విశ్వవిద్యాలయం నుండి "బంగారు పతకం" సాధించిన కుమారి. సహస్ర " అంటూ మైక్ లో వినిపిస్తుంటే.. 

గవర్నర్ గారి నుండి "డాక్టరేట్" వినయంగా అందుకుంది సహస్ర. 


"నా చిన్నతనంలో మ్యాథ్స్ అంటే భయం ఉండేది. ఆ భయాన్ని పోగొట్టడమే కాకుండా ఈ సబ్జెక్ట్ పై ప్రేమను కలిగేలా బోధించిన మా మేడం మెర్సీ గారికి ఈ వేదిక సాక్షిగా అనేకానేక కృతజ్ఞతలు. 


నాడు నేను చదువులో వెనుకబడినా నాలోని ప్రతిభను గుర్తించి.. మట్టిలోని మాణిక్యం లాంటి నన్ను మెరుగుపెట్టి మెరిపించిన మా మేడం గారి చలువే ఈ విజయం. మా మెర్సీ మేడం గారు నాడు జీవితంలో కలవకపోతే నేను ఎక్కడో మారుమూల చోట చిన్న ఉద్యోగమేదో చేసుకుంటూ ఉండే దాన్ని. 


నేడు నేను ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నత మైన పదవిలో ఉన్నానంటే వారిచ్చిన ప్రోత్సాహం,ప్రేరణే కారణమని సవినయంగా తెలియజేసుకుంటున్నాను"


స్టేజ్ పై ధీమాగా నిలబడిన సహస్ర ని ప్రశంసిస్తూ వేదిక చప్పట్లతో మారుమ్రోగింది. 


***


గొర్రెపాటి శ్రీను గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:

 గొర్రెపాటి శ్రీను కలం పేరుతో రచనలు చేస్తున్న నా పూర్తి పేరు నాగ మోహన్ కుమార్ శర్మ .

తల్లిదండ్రులు : శాంతకుమారి, కీ.శే.బ్రమరాచార్యులు

ఉద్యోగం : ప్రైవేటు కంపెనీలో మేనేజర్.

చదువు : డిప్లమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ (బి.టెక్)

వెలువరించిన పుస్తకాలు:

"వెన్నెల కిరణాలు" కవితా సంపుటి(2019),

"ప్రియ సమీరాలు"కథాసంపుటి(2023),

"ప్రణయ దృశ్య కావ్యం" కథాసంపుటి(2025).

ప్రస్తుత నివాసం: హైదరాబాద్.


Comments


bottom of page