top of page

కచదేవయాని - పార్ట్ 9

Updated: Sep 6, 2025

#TVLGayathri, #TVLగాయత్రి, #Kachadevayani, #కచదేవయాని, #TeluguEpicStories, #తెలుగుకథలు


Kachadevayani - Part 9 - New Telugu Web Series Written By T. V. L. Gayathri

Published In manatelugukathalu.com On 26/08/2025

కచదేవయాని - పార్ట్ 9తెలుగు ధారావాహిక

రచన: T. V. L. గాయత్రి

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

జరిగిన కథ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

దేవతల గురువైన బృహస్పతి కుమారుడు కచుడు. మృత సంజీవని విద్య నేర్చుకోవడం కోసం శుక్రాచార్యుని వద్ద శిష్యుడిగా చేరుతాడు. కచుడి పట్ల ద్వేషంతో కొందరు దానవులు అతడిని హత్య చేసి, మృతదేహాన్ని కాల్చి బూడిద చేస్తారు. ఆ బూడిదను మద్యంలో కలిపి శుక్రాచార్యుడి చేత తాగిస్తారు. శుక్రుడు కచుడికి మృత సంజీవని విద్య నేర్పి తన పొట్ట చీల్చుకొని బయటకు రమ్మంటాడు. బయటకు వచ్చిన కచుడు, శుక్రాచార్యుని బ్రతికిస్తాడు. 


తనను వివాహం చేసుకొమ్మని కోరుతుంది దేవయాని. కచుడు అంగీకరించడు. ఇద్దరూ ఒకరినొకరు శపించుకుంటారు. కచుడు దేవలోకం వెళ్ళిపోతాడు. దుఃఖంతో ఉన్న దేవయానిని రాకుమార్తె శర్మిష్ఠకు స్నేహితురాలిగా పంపుతాడు శుక్రాచార్యుడు.శర్మిష్ఠతో తనను పోల్చుకుంటుంది దేవయాని. 





ఇక కచదేవయాని పార్ట్ 9 చదవండి. 


వృషపర్వుని రాజ్యానికి సమీపంలో ఒక పెద్ద అరణ్యం ఉంది. దాని పక్కనే పర్వతాలు, నదులు, సరస్సులు ఉన్నాయి.ఆ పర్వతాల నుండి జలపాతాలు దూకుతూ ఉంటాయి. ఈ మధ్య ఆ అడవిలోని జంతువులు ఎక్కువై సమీప గ్రామాల మీదకు దండెత్తి వస్తున్నాయి. దాంతో గ్రామస్తులు భయపడిపోతున్నారు.ఈ సమాచారం రాజైన వృషపర్వునికి తెలిసింది. వెంటనే రాజు సైన్యాధికారిని పిలిపించి వేటకు వెళ్లి కొన్ని జంతువులను సంహరించి రమ్మని ఆజ్ఞాపించాడు.


అప్పుడే అటువైపుగా వచ్చిన శర్మిష్ఠ అంతా విని సరదాగా "నాన్నగారూ! నేను కూడా వేటకు వెళ్లి జంతువులను సంహరించి వస్తానండి! నన్ను కూడా వీళ్ళతో పంపించండి!" అంది గారాబంగా.


"వద్దమ్మా. నువ్వుచిన్న పిల్లవు. కొంచెం పెద్దయ్యాక వెళుదువు గాని!" అంటూ కూతుర్ని వారించాడు రాజు.


"నేను రకరకాల విద్యలను నేర్చుకొని ఏం లాభం! యుద్దాలలోకి నన్ను ఎప్పుడూ తీసుకొని వెళ్ళరు! పోనీ వేటకైనా వెళ్లి వస్తాను! నా విలువిద్యా నైపుణ్యాన్ని గురువుల దగ్గర మాత్రమే చూపిస్తే ఏం బాగుంటుంది? నా శక్తియుక్తులు ఎలాంటివో మీకు కూడా తెలియాలి కదా!"


నవ్వాడు రాజు.


"నువ్వు యుద్ధానికి వెళ్లేంత వీరవనితవా?"


"మరి!... నా గురించి ఏమనుకుంటున్నారు? పంపించండి నాన్నగారూ!" అభ్యర్థించింది శర్మిష్ఠ.


"మేమందరం ఉన్నాము కదా! భయం లేదు మహారాజా! యువరాణి గారిని పంపించండి!"

నవ్వుతూ చెప్పాడు సేనాధిపతి దీర్ఘదర్శి. అతడు రాజ్యానికి సేనాధిపతి మాత్రమే కాడు, మహారాణి సుమాలినీదేవికి పినతల్లి కొడుకు. శర్మిష్ఠకు వరుసకు మేనమామ అవుతాడు.


అతడి కూతురు కణిక. ఆమె ఎప్పుడూ శర్మిష్ఠతో పాటు ఆడుకుంటూ, అన్ని విద్యలూ నేర్చుకొంటూ ఉంటుంది.


"పిల్లల్ని జాగ్రత్తగా తీసికొనివెళ్ళు దీర్ఘా! చూడమ్మా! మామను, సైన్యాన్ని వదలి ఒంటరిగా ఎక్కడికీ వెళ్లొద్దు! ఆడపిల్లలందరూ పురుషవేషాలతో వెళ్ళండి! ఆడపిల్లలు అడవికి వెళ్లారని శత్రువులకు తెలియకూడదు!" అంటూ జాగ్రత్తలు చెప్పాడు వృషపర్వుడు.


  సంతోషం వేసింది శర్మిష్ఠకు. 

"అలాగే నాన్నగారు!" అంటూ ఛంగు ఛంగున పరిగెత్తుకుంటూ దేవయాని దగ్గరికి వచ్చింది.


"అక్కా! అక్కా! నేను, నా చెలులతో కలిసి వేటకు వెళుతున్నాను!.... నువ్వు కూడా రారాదూ! భలే సరదాగా ఉంటుంది!"


చదువుతున్న తాళపత్ర గ్రంథాన్ని పక్కన పెట్టింది దేవయాని.


"వేటకా? ఆడపిల్లలు వెళ్ళటమేమిటి? ప్రమాదం కాదూ!" ఆశ్చర్యంగా అడిగింది.


"కాదక్కా! మనతో పాటు సైన్యం కూడా వస్తుంది. మనమంతా పురుషవేషాలతో తయారయ్యి వెళదాము! ప్రమాదమేమీ లేదు. మేమంతా వీరవనితలం కదా! మాకస్సలు భయం లేదు! వస్తావా మరి!"


ఉత్సాహంగా కళ్ళు తిప్పుతూ చెప్పింది శర్మిష్ఠ.


 నిరాసక్తంగా చూసింది దేవయాని.


"వద్దులే! నేను రాను! మీలాగా కత్తులు కటార్లు పట్టుకొని యుద్ధం చేయటం నాకు రాదు.. కనీసం గుఱ్ఱపుస్వారీ అయినా చేతకాదు.. మీతోపాటు వచ్చినా తర్వాత ఊరికే గుడారంలో కూర్చోవాలి..ఇక్కడ ఉండటమే నయం! మీరు వెళ్ళండి!"


నిరుత్సాహంగా మొహం పెట్టింది శర్మిష్ఠ.


'అక్క చెప్పింది నిజమే! తామంతా వేటకు వెళితే అక్క ఒక్కతే గుడారంలో ఏం చేస్తుంది?'


శర్మిష్ఠ చెలులతో కలిసి బయలు దేరింది. ఆడపిల్లలందరూ కవచాలు కట్టుకొన్నారు. శిరస్త్రాణాలు పెట్టుకొన్నారు. పురుషుల్లాగే తయారయ్యి ఉత్సాహంగా గుర్రాలను అరణ్యం వైపు దౌడు తీయిస్తూ కదిలారు.

=======================================================================

ఇంకా వుంది..

=======================================================================

 T. V. L. గాయత్రి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం:

Profile Link:



నా పేరు తోకచిచ్చు విజయలక్ష్మీ గాయత్రి.(టి. వి. యెల్. గాయత్రి ). మా నాన్నగారు కీ. శే. పవని శ్రీధరరావు గారు. ప్రకాశంజిల్లా మొగలిచర్ల గ్రామంలోని శ్రీదత్తాత్రేయమందిరమునకు ధర్మకర్తగా బాధ్యతలు నిర్వహించేవారు. అమ్మగారు కీ. శే శ్రీమతి పవని నిర్మల ప్రభావతి గారు ప్రముఖ నవలా రచయిత్రిగా తెలుగు ప్రజలకు చిరపరిచితులు.


నా రచనావ్యాసంగం  2019 సంవత్సరంలో 'ఛందశాస్త్ర రత్నాకర' బిరుదాంకితులయిన శ్రీ తోపెల్ల బాలసుబ్రహ్మణ్యశర్మగారి దగ్గర పద్యవిద్య నేర్చుకోవటంతో ప్రారంభంమయింది.  శతకవిజయము(ఐదు శతకముల సమాహారం ), కవన త్రివేణీ సంగమం (మూడు కావ్యముల సమాహారం ) ప్రచురితములు. ఇప్పటి దాకా 25 సంకలనాల్లో పద్యాలు, కవితలు ప్రచురితములు. వివిధ పత్రికల్లో 200 దాకా పద్యాలు, కవితలు ప్రచురితములు. నేను వ్రాసిన సామాజిక ఖండికలకు 2023 తానా కావ్యపోటీల్లో తొమ్మిదవ స్థానం వచ్చింది. ఇప్పటివరకు 50 కథలు వ్రాసాను. అందులో 25 కథలకు  వివిధపోటీల్లో బహుమతులు వచ్చాయి. నేను వ్రాసిన వ్యాసాలు 20, రూపకాలు 25 కూడా వివిధ పత్రికల్లో ప్రచురితములు. 2022లో స్టోరీ మిర్రర్ వారు 'ది ఆథర్ ఆఫ్ ది ఇయర్ ' అవార్డు ఇచ్చారు. 2024లో సాయివనంలో సాహిత్యం వారిచే 'కవనరత్న 'బిరుదును అందుకొన్నాను.నేను వ్రాసిన నవల 'క్రొత్తనీరు' అచ్చంగా తెలుగు అనే అంతర్జాల పత్రికలో ధారావాహికంగా ప్రచురితమవుతూ ఉంది.


Comments


bottom of page