top of page

లక్ష్యసాధన

#Lakshyasadhana, #లక్ష్యసాధన, #ChCSSarma, #చతుర్వేదులచెంచుసుబ్బయ్యశర్మ, #TeluguMoralStories, #తెలుగునీతికథలు

ముగ్గురు పెద్దలు ఇంట్లో వాదనలో. వక్షణం చూపిస్తున్న వ్యక్తి, తీవ్ర భావోద్వేగాలతో ఉన్న యువకుడు. పట్టాలు, కాగితాలు టేబుల్ మీద.

Lakshyasadhana - New Telugu Story Written By - Ch. C. S. Sarma 

Published In manatelugukathalu.com On 05/11/2025

లక్ష్యసాధన - తెలుగు కథ

రచన: సిహెచ్. సీఎస్. శర్మ


హనుమంతురావు ఒక్కగానొక్క కొడుకు ఆనంద్. అతని తల్లి మాలతి. ఆనంద్ వయస్సు పదిహేను సంవత్సరాలు. పదవ తరగతి పరీక్షలు వ్రాశాడు. హనుమంతురావు క్రిమినల్ లాయర్. బాగా వృత్తిరీత్యా సంపాదించాడు. ప్రస్తుత కాలంలో పేదవాడికి గాని, కోట్లకు లక్షలకు వున్న శ్రీమంతులకు గాని అతి ముఖ్యం డబ్బు... డబ్బు.... పొట్ట కూటికి నానాచాకిరీలు చేసి పేదవాడు, పదో పరకో సంపాదించుకొని రేషన్ బియ్యం... ప్లాట్ ఫామ్ల మీద కుప్పలుగా పెట్టి అమ్మే కూరగాయలను కొనుక్కొని, పులుసుపెట్టుకొని రాత్రి పొట్టనింపుకొని, తెల్లారి గంజినీళ్ళు త్రాగి, ఆలుమగలు ఉదయాన్నే పనికి వెళతారు. ఆ అమ్మకు చంకలో ఒక బిడ్డ, ఉదరంలో మరో బిడ్డ. ఆ తల్లికి నవమాసాలు నిండేవరకూ చాకిరీ చేయక తప్పదు. ఇలాంటి జీవితాలు మన డెభై ఏడు సంవత్సరాల స్వతంత్ర భారతావనిలో ఎన్నో!...?!....


ఇక... కలిగిన మహారాజులు. వారి వారి వృత్తి వ్యాపారాల్లో పది లక్షలను కోటి చేయాలని, కోటిని ఐదారు కోట్లు చేయాలనే ఆకాంక్ష ఆరాటం. రధ చక్రాల్లాంటి వారి ఆ కఠోర నిర్ణయ సాధనకు, పేదవారు ఎందరో చక్రాల క్రింద రాలి నలిగిపోయిన పూల వలే నామరూపాలు లేకుండా పోతున్నారు. ఇది గొప్ప చదువులు ధనబలం, పలుకుబడి వున్న కొందరి మహనీయుల చెరగని మాయని జీవిత గమనం.... ఆరోజు పదవ తరగతి రిజల్ట్ పేపర్లో ప్రచురణ జరిగింది. ప్రతి నిత్యం తెలుగు, ఇంగ్లీష్ పేపర్లు లాయర్ హనుమంతురావు గారి ఇంటికి ఉదయం ఆరున్నర కల్లా పేపర్ బాయ్ మూలంగా చేరుతాయి. ప్రతి నిత్యం ఏడుగంటలకు లేచి, దంతధావనం చేయకుండానే తల్లినడిగి బెడ్ కాఫీ తాగి, ఆపైన ఆనంద్ బాబుగారు దినచర్యను ప్రారంభించి, ఎనిమిదిన్నరకు రెడీ అయ్యి, తొమ్మిదిగంటలకు టిఫిన్ తిని స్కూలుకు స్కూటర్లో బయలుదేరుతాడు. ఎప్పుడూ కేసులు, కోర్టు, విచారణ, సాక్షుల విషయాలతో సతమతమౌతుంటే హనుమంతరావుకు అర్థాంగి మాలతీ, కుమారుడు ఆనంద్ను సక్రమంగా చూచుకొంటూ చదివిస్తూ వుందనే పిచ్చి నమ్మకం.


పేపర్ బాయ్ పేపరు ఇవ్వగానే ఆత్రంగా అందుకొన్నాడు ఆనంద్. తన నెంబరును వెదికాడు. కనిపించలేదు. మరో రెండుసార్లు కళ్ళు పెద్దవి చేసి వెదికాడు. ఫలితం శూన్యం. మౌనంగా పేపరును మడిచి టీపాయ్పై వుంచి, మెల్లగా తన గదివైపుకు నడవబోయాడు ఆనంద్. జాగింగ్కు వెళ్ళిన హనుమంతరావు వచ్చాడు. టీపాయ్ పైనున్న పేపరును, మౌనంగా తన గదివైపుకు విచారంగా వెళుతున్న ఆనంద్ను చూచాడు. "ఏరా!... రిజల్ట్ వచ్చాయా!..." అడిగాడు.


బెదిరిపోయి వెనుదిరిగి తండ్రిని చూచాడు ఆనంద్. ఆనంద్ ముఖ భంగిమలో హనుమంతురావుకు విషయం అర్థం అయింది. "ఎమైందిరా!....." గద్ధించినట్లు అడిగాడు. అది ఆనంద్కు రెండవ అటెంప్టు!!.... కన్నీటితో ఆనంద్ తల దించుకొన్నాడు. భర్త గాత్రాన్ని విన్న మాలతి వేగంగా హాల్లోకి వచ్చింది. భర్తను కుమారునీ చూచింది. అనుభవశాలి, ఆమెకు విషయం అర్థం అయింది.


"నిన్నేరా అడిగేది?.... పరీక్షా ఫలితం ఏమైంది?" అడిగాడు హనుమంతరావు.


మాలతి కుమారుని సమీపించింది. "ఎమైందిరా!..." మెల్లగా అడిగింది.


"పోయిందమ్మా!..." కన్నీటితో చెప్పాడు ఆనంద్. ఏడుస్తూ తలదించుకొన్నాడు.


"రెండవసారి కూడా పోయిందా!....." హనుమంతరావు గర్జన.


తల్లి కొడుకు విచారంగా తలలు దించుకొన్నారు.


"సోఫాలో కూర్చోండి!..."


ఇరువురూ నేరస్థుల వలె తలలు దించుకొని ఒకే సోఫాలో కూర్చున్నారు. వారి ఎదుట సోఫాలో హనుమంతరావు కూర్చున్నాడు. కొడుకు రెండవ సారి కూడా ఫెయిల్ అయినందుకు వారికి చాలా ఆవేశం, కోపం. "దీనికంతటికి కారణం నీవు మాలతీ!..." ఆవేశంగా అన్నాడు.


మాలతి ఉలిక్కిపడి క్షణంసేపు భర్త ముఖంలోకి చూచి తలదించుకొంది. "రేయ్!... నీవు బాగా చదువుతున్నావనుకున్నాను. నీవు చదివిన చదువు ఏందో ఇప్పుడు తేటతెల్లమైంది. మాలతీ!... అతి గారాబం చేసి వాడిని నీవు చెడిపేశావు. రాత్రింబవళ్ళు నేను మీకోసం ఎంతగా కష్టపడుతున్నానో చూస్తున్నావుగా!... 'లక్ష్యసాధన'కు.... ఆశ నీకు ఆస్త్రగాను, శ్వాస నీకు శస్త్రగాను, ఆశయం సారధి గానూ భావించి నిత్యం శ్రమిస్తే లక్ష్యాన్ని సాధించగలంరా!... నీ తల్లి కారణంగా నీవు, పై ఏ ప్రయత్నాన్నీ చేయలేదు. చదవలేదు.


అందుకే నీకు ఈనాడు ఆ కన్నీళ్ళు. నిన్ను ఇంట్లో వుంచను. హాస్టల్లో చేరుస్తాను. వార్డెన్కు నీ గురించి చెప్పి, నిన్ను నలగ గొట్టమని చెబుతాను. తల్లితండ్రుల చేతలు పిల్లల్ని బాధిస్తాయని పెద్దలు అంటారు. నేనూ ఇకపై అక్రమ సంపాదనను ఆశించను. నాకూ కనువిప్పు కలిగింది. జ్ఞానోదయం అయింది" నిట్టూర్చి హనుమంతరావు తన ఆఫీసు గదిలోకి వెళ్ళిపోయాడు.


మాలతి అతని వెనకాలే విచారంగా నడిచింది. ఆనంద్ పశ్చాత్తాపంతో కన్నీటితో తన గదివైపుకు నడిచాడు.


సమాప్తి


సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 

ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:

 పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

 కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

 బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.


Comments


bottom of page